click here
‘కూత’ వినిపించరా!
పటంలో చూపించినట్లు ఆదిలాబాద్ నుంచి వయా నిర్మల్ మీదుగా ఆర్మూర్ వరకు నాలుగు వరుసల జాతీయరహదారి పక్క నుంచి కొత్త రైల్వేలైన్ వేసి పెద్దపల్లి నుంచి నిజామాబాద్కు వేస్తున్న రైల్వేలైన్కు ఆర్మూర్ వద్ద అనుసంధానం చేయాలి. తద్వారా నిజామాబాద్ మీదుగా హైదరాబాద్కు సునాయసంగా వెళ్లొచ్చు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు మహారాష్ట్రలోని కిన్వట్, బాసరల మీదుగా వెళుతున్న ప్రస్తుత రైలుమార్గాన్నీ చిత్రంలో చూడొచ్చు.
ఆదిలాబాద్ పట్టణం, న్యూస్టుడే
ప్రజల...
more... చిరకాల కోరికైన ఆదిలాబాద్-హైదరాబాద్ నూతన రైల్వేలైన్ మంజూరు జిల్లా ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉంది. లైను దూర భారమవుతుండడంతో ఆర్మూర్ వరకు కుదించాలనే ఆలోచన ఉన్నా ఆ వ్యయంలోనూ రాష్ట్రప్రభుత్వం వాటా భరిస్తేనే దీనికి అవకాశం లభిస్తుంది. గతంలో వలే కాకుండా సగం వాటా భరిస్తే రైల్వేలైను మంజూరు చేస్తామని కేంద్రం విధించిన కొత్త నిబంధనతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా ప్రజాప్రతినిధులపై భారం పెరిగింది. త్వరలో కేంద్ర ప్రభుత్వం రైల్వేకు బడ్జెట్ కేటాయింపులు చేయనున్న నేపథ్యంలో ప్రజల చిరకాల వాంఛ ఆదిలాబాద్- హైదరాబాద్ రైల్వే లైను మంజూరుకు జిల్లా ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరంపై కథనం.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని వేలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఈ లైను కోసం ఇక్కడి ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముఖ్యమంత్రిని కలిసి ఒత్తిడి తెస్తేనే మార్గం సునాయసం కానుంది. కేంద్రం ఈ నెలలోనే రైల్వే లైన్లపై ప్రతిపాదనలు కోరనుండడంతో ఇప్పటి నుంచే ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలనే డిమాండ్ బలంగా వినవస్తోంది. తప్పనిసరిగా నిధులు మంజూరు చేయాలనే ఒత్తిడి వస్తోంది. ఇప్పటివరకు కేంద్రం మంజూరు చెయ్యలేదని సాకు చెబుతూ వచ్చినా కొత్త నిబంధన తిరకాసు తెచ్చిపెట్టింది. దీంతో చేతులెత్తయ్యలేని పరిస్థితి ఉండడంతో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల వైపు ప్రజలు చూస్తున్నారు.
వ్యాపార అవసరాలతోపాటు ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళుతుంటారు. నిత్యం వందలాదిమంది ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. దీంతోనే ఆదిలాబాద్ నుంచి నిర్మల్ మీదుగా హైదరాబాద్కు నేరుగా రైలు నడుపాలనే డిమాండ్ ఇక్కడి ప్రజల దశాబ్దాల డిమాండ్. దీని వల్ల ఖర్చుభారం తగ్గడంతోపాటు ప్రయాణం సులువవుతుంది. ప్రతిసారి ప్రజాప్రతినిధులపై ఈ లైను కోసం ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ రైలు మార్గం ఉన్నా మహారాష్ట్రమీదుగా వెళుతుండడంతో దూరభారమవుతోంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు 300 కిలోమీటర్ల దూర వ్యత్యాసముండగా ఆదిలాబాద్ నుంచి సికిందరాబాద్కు ఉన్న రైలు మహారాష్ట్రమీదుగా తిరిగి వెళుతుండడంతో 435 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దాదాపు 135 కిలోమీటర్ల దూర భారం పడుతోంది. దీంతోనే కొత్తలైనుకు డిమాండ్ ఏర్పడింది.
సగం వాటా భరిస్తే కొత్తలైను..
ఆదిలాబాద్-పటాన్చెరు (హైదరాబాద్) వరకు రైల్వేలైన్ 2009-10 రైల్వేబడ్జెట్లో మంజూరు కావడం కాస్త వూరటనిచ్చింది. నిర్మల్ మీదుగా నాలుగు వరుసల రహదారి పక్క నుంచి ఈలైన్ నిర్మాణం కోసం సర్వేలోనే తీవ్ర జాప్యమైంది. తీరా సర్వే చేపట్టాక తమ శాఖకు అంతగా ప్రయోజనం లేదని రైల్వేబోర్డు చేతులెత్తేసింది. గిరిజనులు, నిరుపేదలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఎంపీ గోడంనగేష్ విన్నవించడంతో మళ్లీ సర్వే చేపట్టారు. ఆదిలాబాద్ నుంచి పటాన్చెరు 317 కిలోమీటర్ల పొడవునా రైల్వే లైన్ నిర్మించేందుకు సర్వే చేపట్టగా రూ.3771 కోట్లు ఖర్చు అవుతుందని రైల్వేబోర్డు తేల్చింది. ఏడాదిన్నర కిందట కేంద్రప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధన ప్రకారం ఈ వ్యయంతో సగం వాటా అంటే రూ.1900 కోట్ల వరకు రాష్ట్రం భరించాలి. అంచనా ఎక్కువగా ఉండడంతో ఈ భారం రాష్ట్రప్రభుత్వం భరించదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతోనే ఆ లైను ఆర్మూర్ వరకు కుదించి అక్కడ పెద్దపెల్లి నుంచి నిజామాబాద్కు వెళుతున్న రైల్వే లైనుకు అనుసంధానం చేస్తే నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ సునాసయంగా వెళ్లవచ్చనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీని వల్ల వ్యయంలోనూ సగం భారం తగ్గనుంది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆర్మూర్ వరకు 127 కిలోమీటర్ల దూర వ్యత్యాసమే అవుతుంది. అంటే ఆదిలాబాద్-పటాన్ చెరు వరకు రైల్వేలైన్ కోసం రూ.3771 కోట్ల అంచనావ్యయంలో సగం తగ్గనుంది. ఆర్మూర్ వరకు లైను కోసం దాదాపు రూ.1500 కోట్లలోపే ఖర్చు అవుతుందని రైల్వే అధికారుల అంచనా. ఇందులో సగం వాటా అంటే సుమారు రూ.750 కోట్ల వరకు భరించాలి. దీంతోనే ఈ వాటా భరించేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాల్సి అవసరం ఎంతైనా ఉంది.
గిరిజనులు, నిరుపేదలకు ప్రయోజనం..
హైదరాబాద్ వెళ్లేందుకు ఆదిలాబాద్ ప్రజలు మహారాష్ట్ర మీదుగా వెళుతున్నా మిగతా ప్రాంతం వారికి ఆ అవకాశం కూడా లేదు. నేరుగా బస్సులు కూడా లేకపోవడంతో చాలా మండలాల ప్రజలు తీవ్ర వ్యయప్రయాసాలకోర్చి వెళ్లాల్సి వస్తోంది. ఉన్నత చదువుల కోసం వేలాదిమంది హైదరాబాద్లోనే విద్యనభ్యసిస్తున్నారు. తరచూ వెళ్లే పోషకులకూ ప్రయాణం భారమవుతోంది. రైలు మార్గం ఏర్పడితే వారందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రతిరోజు వ్యాపార లావాదేవీల కోసం వెళ్లే చిరువ్యాపారులకు ఇది లాభమవుతుంది. ఒకవేళ ఈ మార్గం ఏర్పడి ఆదిలాబాద్, ఇచ్చోడ, నిర్మల్లో రైలు ఎక్కేందుకు అవకాశం కల్పిస్తే నిత్యం వేలాదిమంది సామాన్య ప్రయాణికులు, వ్యాపారుల ప్రయాణం సులువు కానుంది.
ఆదిలాబాద్లో జిల్లాకేంద్రంతోపాటు చుట్టుపక్కల మండలాలైన తలమడుగు, తాంసి, ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాలకు ఉపయోగపడనుంది. ఇచ్చోడలో స్టేషన్ ఏర్పాటుచేస్తే చుట్టుపక్కల ప్రాంతాలైన గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, బజార్హత్నూర్, బోథ్ మండలాలతోపాటు ఉట్నూర్, నార్నూర్, సిర్పూర్, జైనూర్ మండలాల ప్రజలకూ ఈ ప్రయాణం ఉపయోగపడనుంది. ఇక నిర్మల్లో ఎక్కే సౌకర్యం ఏర్పడితే అక్కడి జిల్లాకేంద్రంతోపాటు నేరడిగొండ, సారంగపూర్, దిలావర్పూర్, మామడ, లక్ష్మణచాంద, ఖానాపూర్, కడెం, నిర్మల్ మండలాల ప్రజలకు ఉపయోగపడుతుందని తెలుస్తోంది. దీంతోనే ఇన్ని మండలాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఈ లైను మంజూరు చెయ్యాలని విపరీతమైన డిమాండ్ వస్తోంది.
ప్రజాప్రతినిధులదే కీలకపాత్ర..
ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ గోడంనగేష్తోపాటు బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు రాఠోడ్బాపురావు, రేఖాశ్యాంనాయక్లదే ఈ నిధుల మంజూరులో కీలకపాత్ర. అందుకనే వీరు ఏం చేస్తారని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. నిధులు మంజూరు చేయిస్తారా? లేక చేతెలెత్తేస్తారా? అనేది చూడాల్సిందే.
ఆదిలాబాద్-గడ్చాందూర్లైన్ పైనా ఆశలు..
2009-10 రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్-గడ్చాందూర్ వయా జైనథ్, బేల మీదుగా లైను మంజూరుచేసినా ఇంతవరకు సర్వేలేదు. మహారాష్ట్రలోగల గడ్చాందూర్ నుంచి సమీపంలోనే రైల్వే జంక్షనైనా బల్లార్షకు వెళ్లేందుకు సులువుతుంది. తద్వారా దేశరాజధానితోపాటు ఉత్తర భారత దేశంలోని ప్రాంతాలకు ప్రయాణం సునాయసమవుతుంది. ఇప్పటికైనా సర్వే చేపట్టాలనే డిమాండ్ వినవస్తోంది.
ముఖ్యమంత్రిని కలుస్తాంగోడంనగేష్, ఆదిలాబాద్ ఎంపీ
ఆదిలాబాద్-పటాన్చెరు లైనును ఆర్మూర్ వరకు కుదిస్తే ఖర్చు తక్కువవుతుంది. ఇందులో సగం వాటాకోసం రెండు జిల్లాల ప్రజాప్రతినిధులందరం ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తాం. ఎలాగైనా నిధులు వచ్చేలా కృషిచేస్తాం. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి దిల్లీ వెళ్లి రైల్వేమంత్రిని కూడా ప్రత్యేకంగా కలుస్తాం.
మా తపనంతా లైనుపైనే జోగురామన్న, మంత్రి
హైదరాబాద్కు కొత్తలైను మంజూరు చెయ్యాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులందరి తపన. ఎక్కువగా ఇది గిరిజనులు, నిరుపేదలకు ఉపయోగపడుతుంది. అందుకే ఆర్మూర్ వరకు రైల్వేలైన్ కోసం కలిసికట్టుగా ముఖ్యమంత్రిని కలిసి నివేదిస్తాం. సగం వాటా మంజూరు కోరుతాం.
ఈ లైను తప్పనిసరి ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి
నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు రైలు మార్గం లేదు. అందుకనే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వేలైన్ మంజూరు కోసం తీవ్ర కృషిచేస్తున్నాం. కొత్త నిబంధన ప్రకారం సగం వాటా భరించడంపై ముఖ్యమంత్రికి పరిస్థితి వివరిస్తాం.
రైల్వేలైను అభివృద్ధికి దోహదం జగదీశ్ అగర్వాల్, ఆదిలాబాద్ వర్తక, వ్యాపారుల సంఘం అధ్యక్షుడు
ఏప్రాంతమైనా అభివృద్ధి కావాలంటే రవాణా మార్గం తప్పనిసరి. అందులో రైల్వే మార్గం కీలకమైంది. ఆదిలాబాద్ నుంచి కొత్తలైన్ల నిర్మాణాలకున్న డిమాండ్పై జిల్లా ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టాలి. సగం వాటా ఎలాగైనా రాష్ట్రప్రభుత్వం భరించి ప్రజలకు ప్రయోజనం కలిగించాలి.